Sri Krishnadevaraya Nagalapuram

Sri Krishnadevaraya Nagalapuram. అసలు నాగలాపురం కి ఆ పేరు ఎలా వచ్చింది? చరిత్రని పూర్తిగా చదివి తెలుసుకొని, తెలియని వారికీ తెలియజేయండి.

Sri Krishnadevaraya Nagalapuram

శ్రీకృష్ణ దేవరాయలు - నాగలాపురం

క్రీ.శ.1509 సం|| నుండి 1529 వరకు శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యమును పాలించారు. రాయలు ఎన్నో దేవాలయాలు నిర్మించాడు. ఎన్నో దానములు చేశాడు. శ్రీలంక నుండి ఒరిస్సా నుండి బీహారు రాష్ట్రం వరకు మరియు కర్ణాటక నుండి మహారాష్ట్ర గోవా, తెలంగాణా వరకు పాలించాడు. పది లక్షల సైన్యముతో ఓటమి ఎరుగని యోధుడుగా పేరుగాంచాడు. దాదాపు దక్షణ భారతదేశంములో పలుచోట్ల ఆయన వేసిన శాసనాలు చూడవచ్చును. రాయలు కాలంలో వేసినవి 600 శాసనాలు దొరికినట్లు కర్ణాటక హంపి విశ్వవిద్యాలయం ప్రకటించింది. రాయలువారు స్వయంగా రెండు వందల శాసనాలు కన్నడ, తెలుగు, తమిళ, సంస్కృత, దేవనాగర లిపి వేసినట్లు చెప్పబడుచున్నది. రాయలు 18 గొప్ప యుద్ధాలు చేశాడు.

నాగలాపురం గ్రామము చిత్తూరు నుండి చెన్నై వెళ్లే దారిలో "నగరి గ్రామ” సమీపములో ఉన్నది. తిరుపతి నుండి 70 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ వేదనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఈ వేదనారాయణస్వామి మత్స్యావతార మూర్తి నాబి క్రింద చేప రూపం, పైన ఏకముఖ చతుర్భాహు మూర్తి రెండు వైపులా ఉభయ దేవేరులున్నారు. శ్రీదేవి, భూదేవి, మూర్తులు.

పురాణము

వేదనారాయణస్వామి వారి ఆలయం - నాగలాపురం వేద సంరక్షకుడు శ్రీ వేద నారాయణస్వామికి శ్రీ సూర్య నారాయణుని సేవేయ సూర్య పూజామహోత్సవం. సకల ఆలయాల్లోనూ సాధారణంగా అన్నీ ఉత్సవాలు మానవ మాత్రులచే నిర్వహించబడు తున్నాయి. కాని ఈ ఆలయంలో వేద నారాయణస్వామికి సూర్య భగవానుడు చేసే మహోత్సవము.

శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణకు అవతరించిన దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారము. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి ఒకరోజు అనగా కొన్ని కోట్ల సంవత్సరాలు. ఈ కాలాన్ని మనం ఒక యుగంగా పిలుస్తాము. ఒక యుగము ముగేసే వేళలో బ్రహ్మదేవుడు నిద్దురపోవడం సహజము ఆయన నిద్ర ప్రపంచం యొక్క ముగింపును సూచిస్తున్నందున ఆయన నిద్దురలో సకల సృష్టి నాశనమవడంతోపాటు సృష్టికి ఆధారమైన వేదాలు మాత్రం బ్రహ్మచెంతనే జీవంతో ఉంటాయి. బ్రహ్మదేవుడు నిద్రించునపుడు ఆయన యొక్క నాలుగు ముఖాలు నాలుగు వేదాలను పారాయణం చేస్తుండగా అది ఆయన చెవిద్వారా లోపలికి వెళ్ళడాన్ని గుర్తించిన సోమకుడు అను రాక్షసుడు దేవుళ్లకు ఉండే సకల శక్తులు తాను పొందాలని వేదాలను తన నయవంచనతో దొంగిలించి సముద్ర గర్భాన దాక్కుంటాడు. యోగ నిద్రలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఆ సోమకాసురుని కుట్రను గుర్తించి వేదాలను సంరక్షించే బాధ్యత తీసుకున్నాడు. స్వామి మత్స్యావతారం దాల్చి సముద్రము లోనికి వెళ్లి సోమకాసురుని సంహరించి వేదాలను రక్షించి శ్రీ వేద నారాయణుడిగా స్వయంభువుగా అవతరించిన వేళలో ఆయన శరీరము తడిచి ఉన్నందున వేద నారాయణుడికి శ్రీ సూర్య భగవానుడు తన కిరణాలతో వెచ్చదనాన్ని అందించే బాధ్యతను తీసుకున్నాడు. ఈ మహా సంఘటనే “సూర్యపూజ”గా నిలుస్తోంది. అది కృతయుగమునాటిది కాని కలియుగములో ఇప్పటికి ప్రతి సంవత్సరము మార్చినెల 26, 27, 28 తేదీలలో తొలిరోజున మత్స్యము (కాళ్లు) రెండవరోజు నాభి (బొడ్డు), మూడవరోజు శిరస్సు (తల) పైన ప్రసన్న వదనముతో ప్రయోగ చక్రంతో కొలువై వేదనారాయణుడిపై తన నులివెచ్చని కిరణాలు ప్రసరింప చేస్తూ, సూర్యభగవానుడు స్వామిని సేవిస్తాడు.

సూర్యనారాయణుడు, వేద నారాయణుడిని కలిసే వేళలో సాయంత్ర సంధ్యా సమయంలో 6 గం||ల నుండి 6.15 గం||ల వరకు సన్నిధి వీదిలో మనం ఆ సూర్యుని దర్శించి (సూర్య స్నానం) జీవితంలో మార్పును పొందవచ్చును అని భక్తుల నమ్మకం.

ఆ మూడు రోజులు మహా ఉత్సవం జరుగుతుంది. ఒక్కొక్క రోజు సాయంత్రం 7.30 ని॥ తెప్పోత్సవం, రాత్రి 8.30 గం|| తిరువీధి ఉత్సవం జరుగుతుంది.

చరిత్ర

క్రీ.శ.5వ శతాబ్దములో పల్లవరాజులు నిర్మించారని కొందరు పరిశోధకులు చెబుతారు. తర్వాత క్రీ.శ.1070 నుండి 1120 వరకు కంచి రాజధానిగా తొండ మండలం పరిపాలించిన మొదటి కుళుత్తోంగ చోళ బలిజరాజు బంధువు అతని సామంతుడైన రాజమల్లదేవ యాదవరాయలు నారాయణ వనం పాలకుడిగా ఉండి తిరుపతికి 70 కి.మీ దూరంలో వున్న అరిగండాపురం (ఈనాటి నాగలాపురం) లో వేదనారాయణ స్వామి దేవాలయము శిధిలావస్థలో ఉండగా పునర్మించాడు. క్రీ.శ. 15వ శతాబ్దములో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాధీశుడైన తర్వాత ఒకసారి క్రిష్ణరాయలు ఆయన తల్లి నాగలాంబ ఇతర కుటుంబ సభ్యులు కలిసి తమిళనాడులోని కుంభకోణం లోని మహా ముఖ సందర్శనము (మహాముఖం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగి కుంభకోణ క్షేత్రోత్సవము) ఇది ఆనాడు క్రీ.శ.1517 సం|| ఫిబ్రవరి 6వ తేది జరిగింది. అక్కడికి వెళుతూ నాగలాంబ ఆమె జన్మించిన గ్రామమైన అరిగండాపురము చూడాలని కుతూహలముతో ఆ గ్రామములో విడిది చేశారు. తన స్వంత ఊరిలో యాదవ నారాయణస్వామి దేవాలయము శిధిలమై ఆలయ గర్భగుడి మాత్రమే ఉంది. ముళ్లపొదల మధ్య గుబురు చెట్లతో నిండి ఉన్న ఆలయ దీనావస్థను ప్రత్యక్షంగా చూచి చలించిపోయి ఎంతో పురాతనమైన ప్రసిద్ది చెందిన ఆలయ దీనావస్థకు చేరినదని కలత చెంది తన కుమారునితో చెప్పి ఆలయము బాగుగా విస్తరించి నిర్మించమని ఆదేశించింది. వెంటనే క్రిష్ణరాయలు స్థానిక పాలకులను ఆలయ నిర్మాణానికి తగినవిధంగా ఏర్పాటు చేయమని ఆదేశించారు.

ఆ ఆలయ మహాత్మ్యమును అరిగండాపురము గ్రామములో రాజోద్యోగి అయిన వడిమలై అన్నన్ వివరించాడు. అది విన్న రాయలు ఈ క్షేత్రాన్ని తిరుమల మాదిరిగా 108 దివ్య తిరుపతులలో ఒకటి అనే రీతిలో పెద్దఎత్తున ఆలయం, గోపురాలు, తిరుమాళిగలు నిర్మించి ఆళ్వారాచార్యులు బాగవతుల, శిల్పాలతో శోభిల్లుచూ ఉండే రీతిలో నిర్మాణము పని చేపట్టడానికై రెండు లక్షల వరహాలను దానం చేస్తూ వడమల యెన్నను స్థానత్తార్ పట్టమును ఇచ్చి అధికారాన్నిచ్చాడు, అతని తమ్ముడు హరిదాస్ పెరుమాళ్కు అప్పగించాడు.

వేదనారాయణ స్వామి దేవాలయము 12 ఎకరముల స్థలములో మూడు వేలమంది శిల్పులతో శిల్పకళా వైభవముతో నిర్మించాడు. మూలవిరాట్టు మత్స్యావతారము అనగా చేపలో శ్రీమహా విష్ణువు అవతారంలో ఉంటుంది. సున్నపురాయితో తయారు చేసిన విగ్రహము వుంటుంది. నాలుగు వైపులా గోపురాలుంటాయి. మూడు గోపురాలు పూర్తయినవి. నాలుగవ గోపురం కొంత అసంపూర్తిగా ఉంది (కారణం తెలియదు) తర్వాత దానిని పూర్తి చేసారు. తర్వాత ఆ గ్రామమునకు అరిగండాపురము పేరు మార్చి క్రిష్ణరాయలు తన తల్లి నాగలా దేవి పేరుమీద “నాగలాపురం" పేరు మార్చడం జరిగింది. మూడు శాసనములు లభించినవి అందులో ఒక శాసనము క్రింద ఇస్తున్నాము.

శిలాశాసనం 684 - నాగలాపురం, తిరువళ్లూరు తాలూకా, చెంగల్పట్టు జిల్లా (ఎ.ఆర్. 1904-628).
68 - కట్టయిట్టు నిన్ర అరిగండాపురు మెంగిర పేరు మాగాదెన్రు
69 - దేవ మహారాయర్ తమ్ మాతావిన్ పేరాలే నాగలదేవి యమ్మన్ పురమెన్రు క
70 - ట్టళెయిట్టు తంగళుక్కు నాగలాదేవి యమ్మన్ పురం స్తాన ముదలాన్ (అనై)త్తు గొత్తు
71 - క్కాణియం తంగళుక్కు కృష్ణరాయ హరిదాస మోదలియా రెంగిర తాన పట్ట పేరుం పా
72 - లిత్తు ఇంద (ము) రైక్కెల్లాం శిలాశాసనం పణ్ణిన

పై శాసనమునకు అర్థం:

కట్టడి చేసి, అరిగండాపురం అనే పేరు సూక్తము కాదు (అని భావించి) (ఈ గ్రామానికి) తమ తల్లిగారైన నాగలాదేవి అమ్మగారి పేరుతో నాగలాదేవి అమ్మన్ పురము అని పేరుపెట్టి) పిలిచి తమకు (వడమలె యజ్ఞకు) నాగలాదేవి అమ్మన్పురం స్థాన (త్తారు) మున్నగు అన్నసన్నదులనిచ్చి క్రిష్ణరాయ హరిదాస మొదిలియార్ అనే ప్రతినామ పట్టము (పదవి) ఇచ్చి, ఈ తతంగమంతా చేస్తూ - శిలాశాసనము వేయించారు. మిగిలిన రెండు శాసనాలలో గూడా ఇదే విషయము వ్రాయబడి ఉంది.

అరిగండాపురమనే గ్రామానికి రాయలు వారు (తమ తల్లిగారు, రాయలువారు జన్మించిన గ్రామం కాబట్టి) తన తల్లి నాగలాదేవి పేరుమీద నాగలాపురం పేరుపెట్టి వేదగిరి నాదుడి (వేదనారాయణ స్వామి గుడి) ఆలయం వైభవోపేతంగా జీర్ణోద్ధరణ గావించి విస్తరించాడు.

1969 సం||లో రాష్ట్ర ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానము ఆధీనములోకి చేర్చింది. 1979లో మ్యూజియం ఏర్పాటు చేశారు. ముస్లిం రాజుల దాడికి భయపడి దాచిన తొమ్మిది పంచలోహ విగ్రహాలు (4 అడుగల ఎత్తు) శిదిల దేవాలయ, గోడను త్రవ్వగా బయట పడినవి. కొందరు రచయితలు శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగలాదేవి దేవదాసి అని వ్రాశారు.

క్రీ.శ.1514 జూన్ నెల రెండవ తేది, చెంగల్పట్టు జిల్లా, చిన్నకంచి (తమిళనాడు) ఆరుళాళ పెరుమాళ్ దేవాలయ రెండవ ప్రాకారము దక్షిణవైపు గోడమీదున్న శాసనం (తుళువ నర్సా నాయకుడు, (రాయలు తండ్రి) స్వయంగా వేసినది.

12 - తిప్పాజీ, నాగలాదే వ్యోపి, శ్రీ కౌసల్యా సు (మి)త్ర యోరీ దే వారిన
సింహేంద్రాత్త స్మాత్ పంక్తిరదాదిన
13- వీకావింన ఇకౌ రామలక్ష్మణావిన నందనౌ! జాతావీర నృసింహేంద్ర, క్రిష్ణరాయ మహీపతి

పై శాసనమునకు అర్థం :

తిప్పాంబ, నాగలాంబలు, కౌసల్య, సుమిత్రలుగా వారి కుమారులు వీరనరసింహ రాయలు, శ్రీకృష్ణదేవరాయలు, రామ లక్ష్మణులుగా వర్ణించిన శాసనముండగా, నాగలాంబ, దాసి ఎట్లవుతుంది? నాగలాంబ దాసి అయితే, వీరనరసింహరాయలు మరణానంతరం, తుళువ నర్సనాయకుడు మూడవ భార్య ఓబలాంబ కుమారులు, శ్రీరంగరాయలు, అచ్యుత దేవరాయులలో ఎవరో ఒకరు విజయనగర సామ్రాజ్యాధీశుడు కావాలి! కాని శ్రీకృష్ణదేవ రాయలు రాజ్యపాలకుడెట్లా అవుతాడు? దాసి పుత్రుడికి రాజ్యార్హత ఉంటుందా? తిమ్మరసుకు రాజనీతి తెలియదా? విజయనగర సామ్రాజ్యములో సామంతులు ఎదురు తిరగరా? మేధావులు వేలెత్తి చూపరా? (మహాభారతంలో దాని పుత్రుడైన విదురుడికి రాజ్యార్హత ఉందా?)

- Bhattarusetty Padmarao Rayalu

Sri Krishnadevaraya Nagalapuram

Sri Krishnadevaraya Nagalapuram. అసలు నాగలాపురం కి ఆ పేరు ఎలా వచ్చింది? చరిత్రని పూర్తిగా చదివి తెలుసుకొని, తెలియని వారికీ తెలియజేయండి.

nagalapuram history telugu | how came nagalapuram village name | nagalapuram village history | sri krishnadevaraya thalli vamsamu | sri krishnadevaraya pattabhishekam | sri krishna devarayala rajya palana | sri krishna devarayalu balija kshatriyudu | sri krishnadevarayala varasulu | sri krishnadevaraya family