Munnuru Kapu History
Explore the rich history of the Munnuru Kapu community in Telugu. మున్నూరు కాపుల చరిత్ర గురించి చదివి తెలుగుకోండి.

మున్నూరు కాపుల చరిత్ర
మహాబలి అనగా శివుడు. మహాబలిప్రియ అనగా గౌరీదేవి. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల పుత్రులుగా "గౌరిపుత్రులు”గా బలిజలు చరిత్రకెక్కారు. వారు గిరిజన ప్రాంతాలకు నాయకులై బలిజ నాయకులుగా పిలువబడినారు. గిరిజన ప్రాంతాలలో వస్తుమారకం చేశారు. బలిజనాయకుల ఆధ్వర్యంలో నదులు, మైదాన ప్రాంతాలలో చెట్లను నరికించి వ్యవసాయము అభివృద్ధిచేసి 18 కులాల వారికి పెద్దలుగా పెదకాపులైనారు. ఆ తర్వాత భూస్వాములై రాజ్యపాలకులైనారు. మొదట బలి కులమువారిగా తర్వాత బలిజ కులమువారుగా పిలువబడ్డారు.
గౌరీపుత్రులైన బలిజ నాయకులు పెదకాపులుగా అభివృద్ధి చెంది భూస్వాములైన కాపు క్షత్రియులైనారు. వారి నుండి మేధావులైన బ్రహ్మ వంశ కాపు క్షత్రియులద్భవించారు. వారే మనువు (క్షత్రియుడు) కులమువారే సప్తఋషులు. వీరు కాపు క్షత్రియులనే వివాహమాడారు. వజ్రసూరికోపనిషత్తు గ్రంథం ప్రకారం, ఋష్యశృంగుడు, కౌశికుడు, జంబూక మహర్షి, వ్యాసుడు, గౌతమమహర్షి, వశిష్టుడు, అగస్త్యుడు, శౌనక మహర్షి మొదలగువారు గిరిజనులుగా ఉండి, కాపులై బ్రహ్మజ్ఞానులైనారు (వీరు బ్రాహ్మణలు కాదు).
ఐతరేయ బ్రాహ్మణం : ఋగ్వేదంలో గత్సమదుడు సంతతివారు వీతవ్యుడు ఇతని సంతతివాడు. వృత్యమతి ఇతని సంతతివాడు కూర్మ మహర్షి ఇతని సంతతివారు. కూర్మీలు (కాపులు) వీరి నుండి నాలుగు వర్ణాలు ఉద్భవించినవి (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాలు) అందుకే కూర్మావతారుడైన శ్రీమహావిష్ణువు అంశగా చెబుతారు. ఇలియట్ దొర సేకరించిన (తిరుమల శాసనంలోనూ) 2వ పుస్తకములో 419 పేజీలోనూ, భట్టరుశెట్టి పద్మారావు రాయలు వ్రాసిన కాకతీయ బలిజ కాపురాజుల చరిత్ర గ్రంథంలో - 53 పేజీ నందు, 15వ పంక్తిలో “చాతుర్వర్ణ కులోద్భవులుగా” నాలుగు వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నాలుగు ధర్మాలు అనుసరించిన కులములో పుట్టినవారుగా చెప్పబడింది. “కడపజిల్లా చిట్వేలు తాలూకా తామ్రశాసనము"లో వీరబలిజలు శాసనము వేశారు. మరియు త్రిపురాంతక శాసనంలో వీరబలిజలు శాసనము (బి.ఎన్.శాస్త్రి) సేకరణ వీరబలిజలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాలు అనుసరించిన కులములో పుట్టినవారు మనువు కుల పవిత్రులు వీర బలిజలని శాసనము నందు కలదు. మరియు 56 దేశాల రాజ్యపాలకులని శాసనము కలదు. మనువు కులస్థులు క్షత్రియ బలిజలని శాసనం కలదు. చరిత్రకు శాసనాలు ఆధారం.
మనువు కులమువాడే మరీచి. ఇతని కుమారుడు కశ్యపుడు. ఇతను తెలుగు ప్రాంత పాలకుడు. కశ్యప ప్రజాపతి భార్య అతిథి (ఈమె తూ.గో. జిల్లా, ద్రాక్షారామ ప్రాంత పాలకుడు దక్షుడి కుమార్తె) ఈ దంపతులకు సూర్యుడు అనే కుమారుడు జన్మించాడు. ఇతని వంశం సూర్యవంశమైంది. కశ్యప ప్రజాపతి రెండవ భార్య దితి. వీరి సంతతివాడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనువారు. హిరణ్యకశ్యపుడు ఇతను. ఈనాటి కర్నూలు జిల్లా ఆర్లగడ్డ మండలం అహోబిలం ప్రాంతం రాజధానిగా హిరణ్యరాష్ట్రం పాలించాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు భార్య రచన (విశ్వకర్మ కుమార్తె) ఇతని ముని మనుమడు బలిచక్రవర్తి, కశ్యప ప్రజాపతి మూడవ భార్య వినుత కుమారుడు గరుత్మంతుడు మహాబలశాలి. పరాక్రమవంతుడు. (వీరు పక్షుల ఆరాధకులు) గరుడవంశంగా ప్రసిద్ధి చెందింది. కశ్యపుని నాలుగవ భార్య కద్రువ కుమారులు నాగ వంశీయులు (నాగదేవత ఆరాధకులు).
ఈ మనువు కుల సూర్యవంశము వారే. ఈనాటి తమిళనాడులోని నాగరకర్నూలు సమీపంలో సుచంద్రం గ్రామనివాసి. మానవ్య గోత్ర అత్రిమహర్షి భార్య అనసూయ దంపతుల కుమారుడు చంద్రుడు. ఇతను మహారాజైనాడు. ఇతని వంశం చంద్రవంశంగా ప్రసిద్ధి చెందింది. సూర్య, చంద్ర వంశీయులు 'వియ్యంకులు', ఈ చంద్ర వంశము నుండి యదువంశం ఉద్భవించింది. ఈ సూర్య, చంద్ర, యదు నాగవంశీయులు, బలిజ కాపు క్షత్రియులని శాసనాధారాలున్నాయి. చరిత్రకు శాసనాలే ఆధారం (చంద్రవంశం ఈనాటి తమిళనాడులో పుట్టింది).
ఈ చంద్రవంశ యయాతి మహారాజు ఇతను. తమిళ, కన్నడ, కేరళ ప్రాంతము అయిన “మలబార్” రాజధానిగా చేసికొని దక్షిణ భారతదేశం పాలించాడు. యయాతి మహారాజు భార్య దేవయాని (బలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుని కుమార్తె) వీరికి యదువు తుర్వసుడు అను ఇద్దరు కుమారులు, రెండవ భార్య శర్మిష్ట (ఈమె బలిచక్రవర్తి వంశీయుడైన వృషపర్వుడనే రాజు కుమార్తె) ఈమెకు దుహ్యుడు, అనువు, పురురాజు అను ముగ్గురు కుమారులు. వారిలో అనువు రాజు సంతతివాడు సుతపనుడు. మహారాజు అతనికి సంతానము కలుగని కారణముగా దీర్ఘతముడనే ఋషి చేత యజ్ఞము చేయించగా ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి బలి నుండి జన్మించాడు గనుక అతనికి బలిమహారాజుగా ప్రసిద్ధి చెందాడు. ఈ బలి మహారాజు వలన పుట్టినవారైన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్ర అనువారు బలిః = బలి యనువానికి జః జనించి వారు గనుక బలిజలైనారు. బలిః పుత్ర = బలిజ, బలి కుమారులు గనుక బలిజరాజులుగా ప్రసిద్ధి చెంది వీరు క్షాత్రధర్మము; వాణిజ్యము చేసి క్షత్రియబలిజలుగా, బలిజరాజులుగా ప్రసిద్ధి చెందిరి. ఈ ఆరుగురు, అంగదేశము, వంగదేశము, కళింగదేశం, పౌండ్రదేశం, సింహళదేశం, ఆంధ్ర దేశములకు రాజులై వారి వారి రాజ్యములకు వారి పేర్లు పెట్టుకొని పాలించిరి. ఈ బలిమహారాజు సంతతివారే కాశీని పాలించిన పృధ్వీశ్వరుడు ఇతని సంతతివారే. 56 దేశాలలో దేశపతులుగా ఉన్న “శెట్టి బలిజలు.”
బలి మహారాజు కుమారుడు ఆంధ్రుడు ఈనాటి కర్నూలు జిల్లా కృష్ణానది నుండి తుంగభద్ర, హంద్రి నదీతీరం (అందిర) ప్రాంతములోని సాతాని కోట రాజధానిగా త్రిలింగదేశాన్ని (తెలంగాణా, రాయలసీమ, కోస్తా ప్రాంతం కంచివరకు గల రాజ్యాన్ని పాలించి తెలగాలుగా ప్రసిద్ధి చెందారు. ఈ తెలుగు రాజులైన సూర్య, చంద్ర, బ్రహ్మ వంశ కాపు క్షత్రియులు. ఈ త్రిలింగదేశ ప్రాంతము నుండి తెలగాలుగా, 300 ఇండ్లపేర్లు గల తెలగ రాజులు వారి సైన్యాలతో ఉత్తర భారతదేశములోని కొన్ని ప్రాంతాలు జయించుకుంటూ, ఆ రాజ్యాలకు వారి పేర్లు పెట్టుకుంటూ, 56 దేశాలు జయించారు. వీరిని ఆంధ్రరాజులుగా పిలవబడినారు. ఈ ఆంధ్రదేశము నుండి వెళ్ళిన తెలగాలు ప్రపంచమంతా విస్తరించి వలస రాజ్యాలు స్థాపించారు. ఆ కాలం నాటికి కొన్ని దేశాలు లేవు. ఈ తెలగాలు ఉత్తర భారతదేశం పోయి రాజ్యాలు స్థాపించి, ఉత్తర భారతంలో నదులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వ్యవసాయం అభివృద్ధి చేసి భూస్వాములై కాపులుగా (వ్యవసాయం) రాజ్యపాలన, వ్యాపారం ముఖ్యవృత్తులుగా జీవిస్తూ, వారి బందువులు, రాజ్యపాలనకు అవకాశం లేనివారు. వాణిజ్యవేత్తలుగా 56 దేశాలలో ప్రసిద్ధి చెందారు. కొందరు రాజబంధువులు అన్నికులాలవారికి పెద్దలుగా, న్యాయం, తీర్పు, శిక్ష అమలుపరచే, దేశాయి, దేశాయిశెట్టి, దేశపతులుగా వుండి ధర్మపాలన చేశారు.
క్రీ॥శే॥ తుమ్మల సీతారామమూర్తి, అభినవ తిక్కన బిరుదాంకితుడు (18వ శతాబ్ధం)
సీ॥ బ్రహ్మదేశంబు నీ పంటపండిన చేను
మధ్యరాష్ట్రములనీ మాటచెల్లు అస్సాములోన నీయందంబు రాణించు
బీహారునందు నీ పీఠమలరు
"వంగభూమికి వన్నెవాసి గూర్తువు నీవు
బొంబాయి నీవిలాసంబు నెలవు.
మైసూరు సీమ నీమంగళాకృతి వెల్లు
మధురలో నీ పల్కుమారుమ్రోగు సింహళద్వీపమందు నీ చిన్నెలొప్ప
నాఫ్రికాఖండమదిన విహారభూమి
సందియంబేల వైష్ణవశక్తి నీవు
తెలుసుకొన్నాడ నీవపెంపు తెలుగుతల్లీ॥
అర్థము : బ్రహ్మదేశము అంటే ఒకనాటి బర్మాదేశము. నేటి మయన్మార్ నుండి ఆఫ్రికా ఖండము వరకు ఆంధ్రరాజులు (తెలగాలు) చరిత్ర శోభిల్లినది. నీ కీర్తి ఏ విధంగా శోభిల్లినదో తెలుసుకో | తెలుగుతల్లీ! అని కవి వ్రాసినది అక్షర సతమ్యేగదా! అది వైష్ణవశక్తి అనగా కాపుశక్తి (శ్రీ మహావిష్ణువు అంశ), తెలుగుకాపులైన తెలగాలు 56 దేశాలు జయించిరి. ఇతర దేశాలలో కూడా రాజ్యాలు స్థాపించారు.
ఈ విధంగా తెలుగు ప్రాంతము నుండి బయలుదేరి 56 దేశాలలో విస్తరించారు. వ్యవసాయం, రాజ్యపాలన, వ్యాపారం, వృత్తిగా జీవించారు.
తర్వాత కాలములో వారి వారసులు దక్షిణ భారతదేశము మీదకు దండయాత్రకు వచ్చి ఇక్కడ బలిజ క్షత్రియ రాజులతో వివాహ సంబంధాలందుకొని స్థిరపడ్డారు.
- అయోధ్యా నగరాధీశుడు చాళుక్య విజయాధిత్యుడు. దక్షణ భారతదేశం మీదికి దండయాత్రకు వచ్చి రేనాడు ప్రాంతంలో స్థిరపడి, కంచి పల్లవ తెలగరాజుతో యుద్ధం చేసి చనిపోయాడు. అతని భార్య గర్భవతి. ఆమె కడపజిల్లా ముడివేముల అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడి ఇంట ఆశ్రయం పొంది ఒక మగబిడ్డకు జన్మనిచ్చి విష్ణువర్థనుడని పేరు పెట్టి పెద్దవాడై క్షత్రియవిద్యలు నేర్చుకొని ఆనాటి పల్లవ రాజును జయించి అతని కుమార్తెను పెళ్ళాడి కంచి రాజ్యమును దక్షిణ భారతదేశమును జయించాడు. అతని వారసులు, పశ్చిమ, తూర్పు చాళుక్యులుగా ప్రసిద్ధి చెంది బలిజకాపు క్షత్రియులతో వివాహ సంబంధము లందుకొని స్థిరపడ్డారు. ఉత్తర భారత కాపు క్షత్రియులు - దక్షిణ భారత క్షత్రియ బలిజలు ఒకే కుటుంబం. ఈ కలయిక ఆనాటి పురోహితుల వలన జరిగింది. వీరికి ఇతర కులాలతో వివాహ సంబంధాలు లేవు.
- కాకతీయులు - మనువు కుల కాపు క్షత్రియుడైన శ్రీరామచంద్రుని కుమారుడు కుశుడు సంతతిలోని కరికాళ చోళుని సంతతిలో దుర్జయ వంశమని శాసనము వేసుకున్నారు. దుర్జయ వంశీయులైన తెలగ రాజులతో వివాహ సంబంధాలందుకొని స్థిరపడ్డారు. మనువు కుల పవిత్రులు, వీరబలిజలని శాసనముంది.
- చోళులు: మనువు కుల కాపు క్షత్రియుడు. శ్రీరాముడి కుమారుడు కుశుడు సంతతివాడు. కరికాళ చోళుని సంతతివారమని చెప్పుకొని శాసనాలు వేసుకొని బలిజ క్షత్రియులతో వివాహ సంబంధాలందుకొని స్థిరపడ్డారు.
- చంద్రవంశ యయాతిరాజు రెండవ కుమారుడు కాపు క్షత్రియుడైన తుర్వసుడి సంతతివాడనని బలిజ క్షత్రియుడైన శ్రీకృష్ణ దేవరాయలు శాసనం వేశాడు.
- మనువు కులక్షత్రియుడైన అయోధ్యా నివాసి, పంట దేశాయిశెట్టి కుటుంబీకుడు. బేతిరెడ్డి నాయుడు వంశీయులు, కొండవీటి రెడ్డిరాజులు, వీరికి బలిజ క్షత్రియులతో వివాహ సంబంధాలందుకున్నారు. (తూ.గో. జిల్లా రెడ్డి నాయుడు గారి సంతతి రెడ్డి రాజులు) ఈ విధంగా తెలుగు ప్రాంతము నుండి వెళ్ళి ఇతర ప్రాంతాలలో రాజ్యాలు స్థాపించిన కూర్మవంశ (కాపులు) క్షత్రియులు వారి వారసులు. తిరిగి వచ్చి బలిజకాపు క్షత్రియులతో వివాహ సంబంధములందుకొని స్థిరపడి కలిసిపోయారు.
బలిజ కాపు తెలగ కులస్థుల ఆచారాలు - మనువు కాలము నుండి ఇతర కులాలలో వివాహాలు చేసుకోరు. స్వకులములోనే వివాహాలు చేసుకున్నాడు. స్త్రీలకు పునర్వివాహం లేదు.
క్షత్రియ అనగా క్షేత్రము అనగా భూమి. క్షేత్రీయులు అనగా భూస్వాములు, భూపాలకులు వారినే క్షత్రియులంటారు. హిందీ భాషా ప్రాంతాలలో ఖేత్ అనగా భూమి, కత్రియ అనగా భూస్వామి. వారే భూపాలకులైన క్షత్రియులు.
బలిజ అనగా గౌరీపుత్రులని, వణిజులు, వాణిజ్యం చేయువారు. తెలగ అనగా తెలుగువారని త్రిలింగదేశ పాలకులు, కాపు అనగా కాపు కాయువాడు రక్షకుడు అని, కాపు అనగా వ్యవసాయదారుడని అర్థాలున్నాయి. వీరబలిజలనగా క్షత్రియ బలిజలు, యుద్ధ వ్యాపారులు, వారియర్ మర్చంట్సు అంటారు. బలిజలలోని భూస్వాములు కాపు కాయువారు క్షత్రియులు కాబట్టి, క్షత్రియబలిజలు - బలిజకాపు క్షత్రియులయ్యారు. వీరు 56 దేశాలు పాలించి, 96 తెగలు కలిగి, 500 ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాసనములు గలవారు.
శెట్టి - కరణం, కాపు-కరణం, రెడ్డి - కరణం, పటేల్ - పట్వారి, మునసబు - కరణం - ఈవ్యవస్థలో మునసబులు, ఆరోజులలో భూస్వాములే ఉన్నారు. కరణంగా చదువుకున్నవారుండేవారు.
కావేరి, కృష్ణ (మున్నూరునాడు) గోదావరి మూడు ఏరుల ప్రాంత తెలుగు, బలిజ కాపులే ఈనాటి తెలంగాణా మున్నూరు కాపులు 96 తెగలుగా చెప్పుకున్న కూర్మిలు (కాపులు) చాలా ఇండ్లపేర్లు. తెలుగు బలిజ కాపుల ఇండ్ల పేర్లుగా ఉన్నాయి.
మున్నూరు కాపులు
సూర్య, చంద్ర వంశపు క్షత్రియులు ఇద్దరూ వియ్యంకులు. త్రేతాయుగములో నిమిరాజు కుమారుడు మిథిలుడు. ఇతను స్థాపించినదే మిథిలానగరము, ఇతని కుమారుడు విదేహుడు. ఇతను రాజ్యము విస్తరించాడు. ఇతని రాజ్యం విదేహరాజ్యంగా పిలువబడింది. ఇతని కుమారుడు జనకుడు ఇతని కుమారుడు ఉదాసువు. వరుసగా నందివర్థనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహద్రదుడు, మహావీర్యుడు, సుదృతి, దృష్టకేతువు, హర్యాశు డు, మరువు, ప్రతిభందుకుడు, కృతరాయుడు, దేవమీడుడు, విదృతుడు, మహాదృతి, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు కుమారుడు హస్రరోముడు సంతతివాడు. జనకమహారాజు (సీరధ్వజుడు) ఇతని తమ్ముడు కుశధ్వజుడు అనువారు.
మిథిలానగరాధీశుడు జనకమహారాజు సంతానము కోసం యజ్ఞము చేస్తూ, యాగభూమిని దున్నుతుండగా బంగారు పెట్టెలో ఒక బాలిక లభించింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. సీత అనగా నాగేటిచాలు అని అర్థం. సీతాదేవి వచ్చిన తర్వాత జనకమహారాజుకు, ఊర్మిళ, మాండవి; శృతకీర్తి అనే కుమార్తెలు జన్మించారు.
సుప్రసిద్ధ రచయిత కీ॥శే॥ చిలుకూరు వీరభద్రరావు పంతులు గారు వ్రాసిన ఆంధ్రుల చరిత్రలో "కాకతీయాంధ్ర యుగ చరిత్ర" 13వ ప్రకరణమున “మున్నూరు కాపులు” విషయం వ్రాశారు. "క్షాత్రయుగమున విదేహరాజ్యము పంటకాపులకు ప్రసిద్ధి చెంది ప్రధాన స్థానముగా ఉన్నది. ఆ రాజ్యమునకు ప్రభువైన జనకమహారాజు వంశీయులు భూస్వాములై రాజ్యపాలకులైన కాపు క్షత్రియులు. ఈ జనక మహారాజు పేరు సీరధ్వజుడు సీరమనగా నాగలి, ఇతని కోటపై నాగలి గుర్తుగల జెండా ఉంటుంది. అందువలన సీరధ్వజుడంటారు. ఇతను మనుమకుల చంద్రవంశీయుడు.
మనువుకుల ఇక్ష్వాకు వంశ కాపు క్షత్రియుడు అయోధ్యారాజు దశరథుడి కుమారులైన శ్రీరాముడు, లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి యాగరక్షణకు తీసుకెళ్ళి తర్వాత మిథిలా నగర రాజు కాపు క్షత్రియుడు జనకమహారాజు కుమార్తె సీతాస్వయంవరమునకు వెళ్ళారు.
ఏ మహారాజుకు సాధ్యంకాని శివుని విల్లు విరిచి సీతాదేవిని వివాహమాడిన విషయం రామాయణ గ్రంథాలలో ప్రపంచ ప్రసిద్ధి గాంచినది.
ఆ శివుని ధనస్సును మహాసభా రంగస్థలికి, సీతాదేవిని తీసుకొచ్చేటప్పుడు వారి బంధువులు (మేనమామల వరుస అయి ఉండవచ్చు) మూడువందల మంది వీరులు సభాస్థలికి మోసుకొచ్చారని శ్రీమదాంధ్ర భాగవతమున ఈ క్రింది పద్యములో కవి ఇట్లని వర్ణించాడు.
మ॥ ఒక మున్నూరు గదిల్చితెచ్చిన లలాటోగ్రాక్ష చావంబు బా
లకరీంద్రంబు, సులీలమై జెరకులంద్రుంచు చందంబునన్
సకలోర్వీశులు, చూడగా విరిచె దోశ్చక్తిన్, విదేహక్షమా
పకగేహంబున సీతకై గుణమణి ప్రస్పీతికైలీలతోన్ ||
(ఆంధ్రమహాభాగవతము - నవమగ్రంధం - 11వ అధ్యాయం)
ఇది బమ్మెర పోతన తెలుగు భాగవతములోనిది - బమ్మెన పోతన కల్పన చేసి వ్రాశాడేమో! అని అనుకొనుట సరైన మాటకాదు, సంస్కృతభాగవతమున కూడా అట్లాగే ఉన్నది.
"యొలోక వీర సమితౌధనురైశము గ్రం
సీతాస్వయంరం గృహే" త్రిశతో "పనీరం
ఆదాయ బాలగజలీల, ఇవేక్షు యష్టిం
సజ్జీ కృతం నృపవికృష్యంబుభుంజ మధ్యే ॥ (సంస్కృత భాగవతము)
సంస్కృత భాగవతమున "త్రిశత” శబ్ధముండుటయు, ఆ "త్రిశత” అనునది మున్నూరు కాపు కులము వారిలో ఒకే కుటుంబమునకు ఇంటిపేరుగా ఉంది.
ఆ శివుని మహాధనస్సును గదిల్చి తెచ్చిన ఆ మున్నూరు మహావీరుల సంతతివారే ఈ మున్నూరు కాపులని తెలుస్తుంది.
300 సం|| క్రితము “వామన పండిత కవీశ్వరుడు" మహారాష్ట్ర భాషలో వ్రాసిన “వామన పండితీయమను" రామాయణ గ్రంథములో త్రిశతగణశివాచే | సత్వరేత్వదనుసా | పుస్తలితనధలేజే ……. అని, ఈ మూడు వందల మంది వీరులు శివుని విల్లు, సీతాస్వయంవర రంగమునకు కొని తేబడిన వారిగా చెప్పియున్నారు.
చరిత్ర చతురానన కీ॥శే॥ చిలుకూరు వీరభద్రరావు పంతులు ఆంధ్రుల చరిత్ర 5 వ భాగమున 13 వ ప్రకరణమున వ్రాసి ఉన్నారు.
కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గజసైన్యాధ్యక్షుడు నృత్యశాస్త్ర రచయిత వారి తోబుట్టువులు, నారమ్మ, పేరమ్మ (గణపతి దేవ చక్రవర్తి భార్యలు) వారితోబుట్టువు, జాయపనాయకుడు దాదా సోమయసాహిణి, దాది నాగయగన్న సేనాని, విరియాల మల్లయ సేనాని, కొసిగె ఈశ్వరదేవుడు మొదలగు ప్రసిద్ధవీరులు. వీరు కృష్ణాజిల్లా కొండపల్లి (మున్నూరునాడు) ప్రాంత కాపు క్షత్రియులు. వీరు కాకతీయ బంధువర్గములోనివారు.
కళింగ గంగవంశ బలిజక్షత్రియుల వద్ద సైన్యాధిపతిగా ఉన్న శ్రీపతి ముకుంద హరిశ్చంద్రుడు అనే వీరాధివీరుడు వారి వద్ద ఉండనట్లు ఈ క్రింది పద్యము వలన తెలుస్తుంది.
శా॥ బాహాటంబుగ గొండపల్లి కడ, ఇబ్రహీం, దుర్వాహీన్
వ్యూహంబుల్, దలకొన్న నాహ పుటుద్యోగంబుమైసర్వస
న్నాహంబుల్ వచరించి శత్రువులజెండాడన్ వెసన్ బారనా
సాహెబుల్ “త్రిశతాన్వయుండగు" హరిశ్చంద్రుడు సామాన్యుడే ॥
శా॥ విన్ హైదర్ ను డుద్దవిడియెడ్డీలన్ విబాళింపుచో
ఆవేళన్ పెద్ద కొండపల్లికడు జన్యక్షోణి………….ది
క్షావైయార్తులు, వాహినీపతి “హరిశ్చంద్రుడు” మార్కొన్నచో
జీవగ్రాహము కాగబెట్టుకొని నక్షీణ ప్రభావోన్నతిన్
(కవి అభినవ చిక్కయ - గోవ్యాఘ్ర సంవాదపీఠిక)
ఈ విధముగా త్రిశతాన్వయులు (మున్నూరు కాపులు) రాజబంధువులై, సేనా నాయకులై రణరంగమున వీర విహారము సల్పిరి. వీరివృత్తి వ్యవసాయము, వ్యాపారము, సైనికులుగా ఉద్యోగులుగా, వీరు పెండ్లి సమయంలో 4వ రోజు రాత్రి కంకణవిసర్జన అనంతరము “నాకబలియైన పిమ్మట కులదేవత దీపారాధన పూజ చేయుదురు. అటుపిమ్మట “వీరులకొలుపు” లేక వీరబలుకు అను ఉత్సవం జరుపుదురు. ఈ ఆచారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థంగా జరుపుతారు. అందు వీరవాక్యములు పలుకుతూ, కరవాలములు త్రిప్పుతూ, కొందరు బంధువులు, వధూవరుల కడకు వచ్చి దీవించి, దిష్టి తీయుదురు. పూర్వము వీరు వీరాధివీరులు కాబట్టి వివాహాలలో ఉత్సవాలలో వారి పూర్వీకులను స్మరించుకుంటూ భావితరాలకు "వీరచరిత్ర"ను బోధింతురు.
మున్నూరు కాపులు అనగా మూడు ఏరుల ప్రాంతము కావేరి, కృష్ణ, గోదావరి ప్రాంత పెదకాపులు, భూస్వాములై తర్వాత కాలములో పంటకాపులైనారు. వీరు బలిజ కాపులలో ఒక శాఖ అని నా అభిప్రాయం. మధురరాజులను, నైజాం నవాబు పరాక్రమ వంతులైన కొంతమంది సైనికులను పంపమని అడిగారని అందుకు మధురైరాజు పంపిన 300 మంది వీరుల సంతతిమున్నూరు కాపులయినారని కొందరి అభిప్రాయముంది.
ఈనాటి మున్నూరు కాపులు, మొదట తోట బలిజలని పిలిచేవారు. ఆకుతోటలు, కూరగాయలు తోటలు, (ఆనాడు ప్రాజెక్టులు, తెలంగాణాలో లేవు గదా) చెరువుల క్రింద వరి మెట్ట పైర్లు పండించే కాపులు, మరియు సైనికులుగా వ్యాపారము చేసేవారుగా జీవనం సాగించారు.
వరంగల్ జిల్లా, కొమరవెల్లి శైవక్షేత్రం, కలియుగప్రారంభ కాలము నాడు గ్రామాధికారిగా, భూస్వామిగా ఉన్న ఆదిరెడ్డి ఏడుగురు కుమారులలో చివరివాడు “కాపు మల్లన్న” భార్య బలిజమేడాలమ్మ. వీరు పార్వతీ పరమేశ్వరులుగా పూజలందుకుంటూ, 10వ శతాబ్ధము నాటికి ప్రసిద్ధి చెంది ఈనాడు తెలంగాణాలోని ఎక్కువ ఆదాయం వచ్చే శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. బలిజ మేడాలమ్మ సోదరుడు వెంకటేశ్వరస్వామి, దేవాలయ చరిత్ర ఆధారము, తోట బలిజలుగా, తెలంగాణా ప్రాంత పాలకులు తెలగాలుగా, తర్వాత కాలములో ఈ తోట బలిజలు - మెట్ట ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ పంటకాపులుగా ఉన్నారు.
తెలంగాణా ప్రాంతములో ఈనాటి మున్నూరు కాపుల ఇండ్ల పేర్లు పరిశీలించండి, కోస్తా రాయలసీమ ప్రాంతములోని బలిజ కాపులు ఇండ్లపేర్లే ఉన్నాయి. కానీ కొన్ని గ్రామాల పేర్లు ఇండ్ల పేర్లున్నాయి. తోట బలిజలుగా ఉన్న వారిని ఒక సభలో 1884 సం॥ సురవరం ప్రతాపరెడ్డి - మున్నూ కాపుకులంగా చూచించాడు. అప్పటి నుండి మున్నూరు కాపులయినారు.
కర్నూలు ప్రాంత పాలకుడు ఆరవీటి బుక్కభూపాలుడు ఆస్థానములో దేవల్రాజు “భట్టురాజు కవి” చెప్పినట్లు క్రీ. శే॥ చిలుకూరు వీరభద్రరావు పంతులుగారు కాకతీయాంధ్ర రాజయుగ చరిత్ర గ్రంథములో ఈ క్రింది విధంగా వ్రాశాడు. (15వ శతాబ్ధము) "పంటాన్వయమునను పధ్నాలుగు శాఖలు జక్కగా వివరింతు సత్యమరసి
మోటాటి, వెల్నాటి, మొరసు, నేరడ యోద్య,
పంట, పొంగలినాటి, పాకనాటి
భూమంచి, కుంచేటి, మున్నూటి, గోటేటి యొనర, గండికోట, యోరుగంటి యనబరుగుడుచునుండు నాంద్రావనీస్థలి గౌరవాధిష్టిత కాపుకులము
పంట పదునాల్గు కులములంచంట జగతి
దరతరంబుల నుండియు వరలెడినుడి
వీనికుపజాతులున్న వివిధములుగా
భుజబలాటోప పిన్నమ బుక్కబూప”
ఇవి ఆంధ్రావనిలోని ప్రాంతాలలో పంటకాపులుగా ఉన్న అనేక కులాలవారు ఇందులో కృష్ణాజిల్లా ప్రాంతమున్నూటి సీమ బలిజకాపులు, గోదావరి జిల్లా మెట్టప్రాంతం, పొగలినాటి బలిజకాపులు కూడా ఉన్నారు. మొరసునాడు తమిళనాడు కృష్ణగిరి జిల్లా, కర్నాటక కోలారు ప్రాంత బలిజకాపులు ఉన్నారు. ఉత్తరాంధ్ర గాజుల కాపులు, మహానాటికాపులు, అయ్యకర కాపులు, పెదకాపులు వీరు బలిజలుగా ఉండి, వ్యవసాయం చేసి కాపులయినవారే! తెలగాలలో వ్యవసాయదారులున్నారు. బ్రిటీష్ వారి మాన్యువల్ చూడవచ్చు, విశాఖపట్నం పెరిక బలిజలు, వ్యవసాయం చేసి పెరికకాపులైనారు.
మున్నూటి సీమకాపులుకు రెడ్డి, నాయుడు బిరుదులు కలవు. శాసనములు భట్టరు శెట్టి వ్రాసిన కాకతీయ బలిజకాపు రాజుల చరిత్ర - 166 పేజీలో చూడవచ్చును. తెలంగాణా మున్నూరు కాపులకు గూడా, రెడ్డి, నాయుడు, శెట్టిబిరుదులున్నాయి.
Balija: The Chief Telugu Trading caste Many of the Balijas are now engaged in cultivation and this accounts for so many having re- turned Kapu as their main caste for Kapu is a common Telugu word for a ryot or cultivator it is not improbable that there was once a closer connection then now between the kapus and Balijas.
Under Kapu Heading in caste and Tribes of South Indian Vol.No.111.
బలిజ అనే పదము వ్యాపారమైనా, అందులో క్షత్రియబలిజలు రాజ్యపాలకులైనారు. బలిజకాపులు, పెదకాపులుగా భూస్వాములుగా తర్వాత కాలంలో పంట కాపులుగా కొన్ని తెగలవారున్నారు. వ్యవసాయం, రాజ్యపాలన, వాణిజ్యం కృతయుగ ప్రారంభకాలము నుండి వృత్తిగా జీవించారు. వాణిజ్యం లేకుండా, వ్యవసాయం లేకుండా రాజ్యపాలన సాగదు.
మున్నూరు కాపులలో - ఎల్లాపు, హజారీకాపు తెగలున్నాయి. (1) ఎల్లాపు అనగా ఎల్లలు (సరీహద్దులు) కాపుకాచే యోధులు - హజారీ కాపు అనగా వెయ్యిమంది సైనిక గుంపుకు సైన్యాధిపతి - వీరి కుటుంబాలు రాజపుత్రులు. వీరి బంధువులైన మున్నూరు కాపులలో కలిసిపోయారు.
- భట్టరుశెట్టి పద్మారావు రాయలు
Munnuru Kapu History
Explore the rich history of the Munnuru Kapu Community in Telugu. మున్నూరు కాపుల చరిత్ర గురించి చదివి తెలుగుకోండి.
Telaga Caste History Telugu | Gajula Balija History Telugu | Kapu Community